జ్యోతి హత్యను జీర్ణించుకోలేక తండ్రి మృతి

7 Mar, 2019 07:37 IST|Sakshi
కుమారై జ్యోతితో గోవిందయ్య(ఫైల్‌)

ముద్దాయి ఇంటిపై బంధువుల దాడి

గుంటూరు, తాడేపల్లి రూరల్‌(మంగళగిరి): తన కుమార్తెను దారుణంగా హత్యచేశారన్న బాధను జీర్ణించుకోలేక అనారోగ్యం పాలైన తండ్రి గోవిందయ్య చికిత్స పొందుతూ మరణించాడు. ఫిబ్రవరి 15 నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. బిడ్డ హత్యను తట్టుకోలేకే తండ్రి కూడా మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. మూకుమ్మడిగా హత్యకేసులో నిందితుడి ఇంటిపై దాడి చేసిన ఘటన  తాడేపల్లి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. రాజధాని ప్రాంతంలో ఫిబ్రవరి 11వ తేదీ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన అంగడి జ్యోతి తండ్రి జ్యోతి మరణాన్ని జీర్ణించుకోలేక ఆమె తండ్రి గోవిందయ్య అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు గత నెల 15న ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. (పెళ్లి ప్రస్తావన రాగానే చంపేశాడు)

శ్రీను బంధువులపై దాడి
బుధవారం సీతానగరంలోని జ్యోతి ఇంటి నుంచి గోవిందయ్య అంత్యక్రియలను నిర్వహించేందుకు శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. గోవిందయ్య, జ్యోతి మధ్య అనుబంధాన్ని బంధువులు చర్చించుకున్నారు. అంత్యక్రియలు పూర్తిచేసి తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఉన్న చుంచు శ్రీను ఇంటిని చూసిన బంధువులు జ్యోతి, గోవిందయ్యల మృతికి కారణమైన వాడి ఇల్లు ఇదేనంటూ ఆ ఇంటి తాళాలు పగలగొట్టి, తలుపులు విరగ్గొట్టి దాడికి పాల్పడి, ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. పక్కనే ఉన్న చుంచు శ్రీను బాబాయి లక్ష్మీనారాయణ, పిన్ని, నాయనమ్మపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని స్థానికులు చూసి 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో జ్యోతి బంధువులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. చుంచు శ్రీను బంధువులు సైతం పోలీసులకు 100 ద్వారా ఫిర్యాదు చేశారు కానీ, పోలీస్‌స్టేషన్‌లో రాత్రి 8 గంటల వరకు ఫిర్యాదు చేయలేదు. (కేసు ముగించే కుట్ర )

మరిన్ని వార్తలు