ఒంటరి మహిళలే లక్ష్యంగా.. నమ్మించి అత్యాచారాలు

23 Nov, 2019 09:25 IST|Sakshi
విలేకరుల సమావేశంలో జహంగీర్‌ అకృత్యాలను వెల్లడిస్తున్న డీసీపీ డాక్టర్‌ శరణప్ప,  పట్టుబడిన నిందితుడు జహంగీర్‌

సాక్షి, బనశంకరి : ప్రముఖ మాల్స్‌ వద్ద ఒంటరి మహిళలను నమ్మించి కారులో అపహరించి అత్యాచారానికి పాల్పడి నగదు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్న నయవంచకుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. తమిళనాడు తిరుచ్చికి చెందిన శ్రీరంగం జహంగీర్‌ ఎంబీఏ పట్టుభద్రుడు. నిందితుడిని శుక్రవారం తూర్పు విభాగం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇతడి వద్ద నుంచి స్కోడాకారు, సెల్‌ఫోన్, హ్యాండ్‌బ్యాగ్స్‌ను స్వాదీనం చేసుకున్నట్లు తూర్పువిభాగం డీసీపీ డాక్టర్‌ ఎస్‌టీ.శరణప్ప తెలిపారు. శుక్రవారం నగరంలో విలేకరుల సమావేశంలో డీసీపీ శరణప్ప వివరాలు వెల్లడించాడు. తమిళనాడు తిరుచ్చికి చెందిన శ్రీరంగం జహంగీర్‌ (30) చెన్నైలోని ఓ ప్రముఖ రిసార్టు కంపెనీలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు. కస్టమర్లతో ఎంతో వినయంగా మాట్లాడే జహంగీర్‌ ఒంటరిగా ఉన్న మహిళలకు తాను పారిశ్రామికవేత్తను అని నమ్మించేవాడు. అనంతరం మహిళలను కారులో అపహరించి వారిపై అత్యాచారానికి పాల్పడి నగదు, బంగారు ఆభరణాలతో ఉడాయించేవాడు. వివిధ పేర్లతో మోసం చేసేవాడు. ఇతని మోసానికి ఎంతో మంది మహిళలు బలయ్యారు. విషయం బయటకు వస్తే పరువు పోతుందని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని డీసీపీ తెలిపారు.
 
మోసాలు ఇలా : 
ఈనెల 5న రాత్రి పది గంటల సమయంలో బెంగళూరు ఎంజీ.రోడ్డులోని వన్‌ఎంజీ మాల్‌ వద్ద ఓ యువతిని పరిచయం చేసుకుని ఆమెను మాటలతో ఆకట్టుకుని తన కారులో కూర్చోబెట్టుకుని మొబైల్, పర్సు లాక్కుని కోరమంగల పెట్రోల్‌ బంక్‌లో రూ.4 వేలకు ఆమె ఏటీఎం కార్డు నుంచి పెట్రోల్‌ పట్టించుకున్నాడు. అనంతరం హోటల్‌ గదిని బుక్‌ చేసుకుని లైంగిక ప్రక్రియకు ఆహ్వానించాడు. ఆమె నిరాకరించడంతో తీవ్రపరుష పదజాలంలో దూషించి దాడికి పాల్పడి రూమ్‌ అద్దె కూడా ఆమెతోనే చెల్లించాడు. ఈఘటనపై హలసూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మరో ఘటనలో మే ఒకటిన మహదేవపుర నుంచి సింగయ్యనపాళ్య వీఆర్‌.మాల్‌ వద్ద ఓ మహిళకు  కిరణ్‌రెడ్డి అని పరిచయం చేసుకుని మీడియా కంపెనీ ఉందని నమ్మించి ఓ పబ్‌కు తీసుకెళ్లి మద్యం తాగాలని బలవంతం చేశాడు. అక్కడి నుంచి మైసూరుకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత మే 23 తేదీ సాయంత్రం 6.30 సమయంలో తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం ముగించుకుని హైదరాబాద్‌కు వెళ్లడానికి బస్సుకోసం వేచిచూస్తున్న మహిళకు మాయమాటలు చెప్పి తన కారులో వైట్‌ఫీల్డ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ సదరు మహిళ ఏటీఎం కార్డు తీసుకుని ఉడాయించాడు.  

నమ్మించి వంచన 
 గత 2017లో చైన్నై వేలచ్చేరి ప్రాంతంలోని ఫినిక్స్‌మాల్‌కు వచ్చిన ఓ మహిళను నమ్మించిన వంచకుడు మహిళను తన వెంట తీసుకెళ్లి  ఓ మొబైల్‌షాప్‌లో రూ.68 వేలు చేసే మొబైల్‌ను ఆమె డెబిట్‌కార్డు నుంచి కొనుగోలు చేశాడు. అంతేగాక ఆమె ఏటీఎం కార్డులనుంచి రూ.2 లక్షలు డ్రా చేసుకుని మోసం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. అలాగే ఓ యువతిని జహంగీర్‌ అని పరిచయం చేసుకుని ప్రేమించి పెళ్లిచేసుకుంటానని నమ్మించి 2018 సెప్టెంబరు 8న మహాబలిపురం రిసార్ట్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన అనంతరం మైసూరు,  ఊటీ, కొడైకెనాల్, గోవా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు