ప్రాణం తీసిన అనైతిక బంధం

4 Apr, 2019 12:48 IST|Sakshi
ఆత్మహత్య చేసుకొన్న ప్రేమ జంట ప్రేమ, నాగరాజు మృతదేహాలు

పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య

కెలమంగలం: వివాహేతర సంబంధం ప్రాణాలను బలిగొంది. జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన హొసూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. వివరాల మేరకు హొసూరు సమీపంలోని పన్నపల్లి గ్రామా నికి చెందిన వితంతు మహిళ ప్రేమ (40). ఆమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ప్రేమ భర్త కొంతకాలం క్రితం మరణించాడు. ప్రేమ హొసూరు అన్నానగర్‌లో నివాసముంటూ రైతు బజారులో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుండేది. 

పరిచయంతో సంబంధం  
ఈ తరుణంలో గత కొన్నేళ్ల క్రితం రైతుబజారుకు తరచూ వస్తున్న కెలమంగలం సమీపంలోని జ్యోతిపురం గ్రామానికి చెందిన నాగరాజు (45)తో ప్రేమకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. నాగరాజు ప్రేమ ఇంటికి తరచూ వచ్చి వెళ్లేవాడు. మంగళవారం ప్రేమ ఇంట్లో ఇద్దరూ కలిసి  పురుగుల మందు తాగారు. ఇది గమనించిన స్థానికులు ఇరువురినీ చికిత్స కోసం హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రేమ మృతి చెందింది. నాగరాజు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.

ప్రేమను విడిచి ఉండలేక
నాగరాజుకు భార్య మాదేవమ్మ, ఇద్దరు పిల్లలున్నారు. ప్రేమతో వివాహేతర సంబంధం నాగరాజు కుటుంబసభ్యులకు తెలియడంతో దండించినట్లు సమాచారం. తరచూ గొడవలు జరుగుతుండడంతో ప్రేమను విడిచి ఉండలేక ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. హొసూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.  
 

మరిన్ని వార్తలు