ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

22 Dec, 2017 09:16 IST|Sakshi
చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ ,అఖిల

వేర్వేరుగా విషం తాగి ఆస్పత్రిపాలైన యువతీయవకుడు

పెళ్లి ఇష్టంలేక ప్రియుడు..మనస్తాపంతో ప్రియురాలు   

ఆత్మహత్య లేఖల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు

మంచాల (ఇబ్రహీంపట్నం): విషం తాగి ప్రేమికులు వేర్వేరుగా ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని యువతి తరఫు బంధువులు యువకుడిపై ఒత్తిడి తేవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి కూడా మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఎల్లమ్మతండాలో గురువా రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం డాకు తండాకు చెందిన అఖిల గత రెండు నెలలుగా ఎల్లమ్మ తండాలోని తమ బంధువుల ఇంటి వద్ద ఉంటూ ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఎల్లమ్మతండాకు చెందిన సపావట్‌  శ్రీకాంత్‌ ఆదిబట్లలోని టాటా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.  వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.

కుల పెద్దలు పెండ్లి చేయాలని ఇరువురి పిలిచి అడిగారు. అయితే శ్రీకాంత్‌ మాత్రం అఖిలను పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదని చెప్పాడు. ఆమెను ప్రేమించావు గనుక ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని యువతి తరఫు బందువులు శ్రీకాంత్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో శ్రీకాంత్‌ ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న  అఖిల కూడా విషం తాగింది. ఆమెను కూడా ఇబ్రహీంపట్నంలోని మరో ప్రైవేట్‌ వైద్యశాలలో చేర్చారు. వీరిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ఇద్దరి ఆత్మహత్య లేఖలు లభ్యం
ఆత్మహత్యకు ముందు అఖిల ఉత్తరం రాసింది. శ్రీకాంత్‌ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని.. కానీ ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొంది.
తన మృతికి శ్రీకాంత్, అతని తల్లిదండ్రులు కారణమంటూ వారి పేర్లు ఉత్తరంలో రాసింది. అదే విధంగా శ్రీకాంత్‌ కూడా ఆత్మహత్యకు ముందు లేఖరాశాడు. తన మృతికి అఖిల బంధువులే కారణమంటూ లేఖలో ఆరోపించాడు. తనకు ఇష్టం లేకున్నా అఖిలతో పెళ్లి చేసేందుకు ఆమె బంధువులు తనపై ఒత్తిడి తెస్తున్నారని.. అది భరించలేకే ఆత్మహత్యకు పాల్పడున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు