స్నేహితుడిని కేసులో ఇరికించాలనుకుని..

5 Feb, 2019 10:36 IST|Sakshi
కారు సీట్లో గంజాయి ప్యాకెట్లు

చిక్కడపల్లి: స్నేహితుడిని గంజాయి కేసులో ఇరికించాలని భావించిన ఓ యువకుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.అశోక్‌నగర్‌ గీతారెసిడెన్సీలో ఉంటున్న కవాడిగూడ కార్పొరేటర్‌ లాస్య నందిత వద్ద నాగరాజు అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అంతకు ముందు ఆమె వద్ద డ్రైవర్‌గా పని చేసిన దామెదర్‌ ఎలాగైనా నాగరాజును  విధుల  నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన మిత్రుడు శ్రీనివాస్‌రావుకు మద్యం తాగించి ఆదివారం నాగరాజుకు చెందిన ఇన్నోవా కారులో గంజాయి పెట్టాలని సూచించాడు.

అనంతరం దామోదర్‌ చిక్కడపల్లి పోలీసులకు ఫోన్‌ చేసి దీనిపై సమాచారం అందించాడు. ఎస్‌ఐ బాల్‌రాజ్‌ సంఘటనా స్థలానికి వెళ్లి కారులో ఉన్న 70 గ్రాముల ఆరు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.  దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా శ్రీనివాసరావు కారులో గంజాయి పెడుతున్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దామోదర్‌ సూచనమేరకే కారులో గంజాయి ప్యాకెట్లు ఉంచినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు