రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

7 Jun, 2018 11:39 IST|Sakshi
నిఖిల్‌సాయి మృతదేహం 

మరో నలుగురికి గాయాలు

హాజీపూర్‌(మంచిర్యాలరూరల్‌) : హాజీపూర్‌ మండలం దొనబండ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రికి చెందిన ఓ యువకుడు మృతిచెందగా మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. హాజీపూర్‌ ఎస్సై ముత్తన్న తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి రాజీవ్‌నగర్‌కు చెందిన శెట్‌పల్లి నిఖిల్‌సాయి, రాజ్‌కుమార్, సాయిపవన్, వెంకటరమణ, సిద్దులు కారులో మందమర్రి నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ట్రాక్టర్‌ కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న శెట్‌పల్లి నిఖిల్‌సాయి(19) తలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజ్‌కుమార్, సాయిపవన్, వెంకటరమనణ, సిద్ధులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హాజీపూర్‌ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో నిఖిల్‌సాయి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.

మిగతా నలుగురు యువకులు పట్టణలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు. కాగా మృతుడు నిఖిల్‌సాయికి తండ్రి రాజేశం, తల్లి విజయ ఉన్నారు. తండ్రి క్యాబ్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిఖిల్‌సాయి బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు