న్యూ ఢిల్లీ : ఇంటి ముందే ఓ యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. బైక్పై వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని తుపాకులతో కాల్చి చంపారు. ఈ సంఘటన ఢిల్లీలోని సంగమ్ విహార్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంగమ్ విహార్కు చెందిన నిశాంత్ శర్మ అనే యువకుడు మంగళవారం రాత్రి ఇంటి బయట నిల్చుని ఉన్నాడు. ఇంతలో బైక్పై అక్కడకు వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై తుపాకులతో కాల్పులు జరిపి, అక్కడినుంచి పరారయ్యారు. పెద్దగా తుపాకి పేలిన శబ్ధం రావటంతో ఇంటిపక్కల వారు అక్కడికి వెళ్లి చూడగా.. నిశాంత్ రక్తపు మడుగుల్లో కనిపించాడు. వెంటనే అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
నిశాంత్ను పరీక్షించిన వైద్యులు అతడు మరణించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంగమ్ నగర్లో గ్యాంగ్ వార్ల కారణంగా గతంలో కూడా చాలా మంది హత్యకు గురయ్యారని నిశాంత్ బంధువు తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీటీవీ ఫోటేజీల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.