నగ్నంగా 2 కిమీ నడిపించి..

22 Mar, 2018 12:53 IST|Sakshi

జైపూర్‌ : రాజస్ధాన్‌లో దారుణం చోటుచేసుకుంది. పొలంలో పనిచేసేందుకు నిరాకరించినందుకు మైనర్లను కొందరు దుస్తులు విప్పి నగ్నంగా రెండు కిలోమీటర్లు నడిపించిన ఘటన వెలుగుచూసింది. బికనీర్‌కు సమీపంలోని మోతావ్తా గ్రామంలో అందరు చూస్తుండగా మైనర్లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ దారుణానికి పాల్పడిన వారు ఘటనను వీడియో తీసినట్టు పోలీసులు తెలిపారు.

పొరుగునే ఉన్న పొద్దుతిరుగుడు పంట సాగుకు సహకరించేందుకు నిరాకరించామని తమను కొందరు దారుణంగా కొట్టారని, బట్టలు లేకుండా రెండు కిలోమీటర్లు పైగా నడిపించారని బాధిత బాలుడు చెప్పాడు. ముగ్గురు బాలురను గణేష్‌ సింగ్‌ అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి పొలం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గ్రామం వరకూ నగ్నంగా నడిపించాడని పోలీసులు తెలిపారు. బాలురను వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా, పొలంలో పనిచేసేందుకు నిరాకరించినందుకు మైనర్లను దారుణంగా వేధించారని పోలీసులు చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు