యువకుడి అనుమానాస్పద మృతి

23 Jun, 2019 10:35 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : మండలంలోని కరవది అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన గరికముక్కల శామ్యూల్‌ (23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూసి పక్కనే ఉన్న బిల్డింగ్‌పై శామ్యూల్‌ నిద్రపోయాడు. తనతో ఉన్న తమ్ముడు ఆటోలో ఉదయం 3 గంటలకు ఎస్సీ కాలనీ వెళ్లి అక్కడ కార్మికులను ఎక్కించుకుని ఇటుక బట్టీల వద్ద దింపి తిరిగి వచ్చాడు.

తిరిగి వచ్చిన తమ్ముడికి అక్కడ అన్న కనిపించలేదు. కారు డ్రైవింగ్‌కు వెళ్లి ఉంటాడని భావించి నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 7 గంటల సమయంలో పందులు కాస్తున్న వ్యక్తి ఇంటికి సమీపంలో మృతదేహాన్ని గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చాడు. శామ్యూల్‌ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాలుకా ఎస్‌ఐ శ్యాంసన్‌ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు అంచిపోగు ఆత్మానందం, దార్ల బాబూరావులు మృతుడి తల్లిదండ్రులను ఓదార్చారు.  

మరిన్ని వార్తలు