పనికి పంపితే వ్యభిచారంలోకి దించారు

26 Apr, 2019 10:45 IST|Sakshi

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు

కేసు నమోదు చేసిన పోలీసులు

టీ.నగర్‌: తమ కుమార్తెను పని కోసం పంపితే వ్యభిరాచకూపంలోకి దించారని బాలిక తల్లిదండ్రులు కాంచీపురం ఎస్పీ సంతోష్‌కి బుధవారం ఫిర్యాదు చేశారు. వివరాలు..ఉత్తరమేరూరు సమీపంలోని మానాంబదికండిగై గ్రామానికి చెందిన దంపతులకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. 2018 నవంబర్‌ 17న అదే ప్రాంతానికి చెందిన వేలాంగని ఆమె స్నేహితుడు అర్బుతరాజ్‌ బాలిక ఇంటికి వచ్చారు. బాలికను ఇంటి పని కోసం పంపమని కోరారు. ఒత్తిడి తేవడంతో బాలికను పంపారు. ఇలావుండగా ఈస్టర్‌ పండుగ జరుపుకునేందుకు కుమార్తెను ఇంటికి పంపాలని తల్లిదండ్రులు కోరారు. మీరే వచ్చి తీసుకెళ్లండని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. ఒత్తిడి తేవడంతో ఏప్రిల్‌ 19న కుమార్తెను ఇంటికి పంపారని తెలిపారు.

రెండు రోజుల తర్వాత కుమార్తెను తీసుకువెళ్లేందుకు వారు వచ్చారని, ఆ సమయంలో తమ కుమార్తె వారితో వెళ్లనని ఏడుస్తూ తెలిపిందన్నారు. దీని గురించి విచారించగా వేలాంగని, అర్బుతరాజ్‌ బాలికను చెన్నై, చెంగల్పట్టు, వడపళని వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి బెదిరించి లైంగిక వ్యాపారంలో దించినట్లు బాలిక తెలిపిందన్నారు. అంతేకాకుండా అసభ్య వీడియోలు చిత్రించి తల్లిదండ్రులకు చెబితే వీటిని విడుదల చేస్తామని హత్యా బెదిరింపులు చేసినట్లు తెలిపారు. తమ కుమార్తెకు మత్తు మందిచ్చి పలువురితో వ్యభిచారం చేయించారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం బయటపెట్టకుండా ఉండడానికి అర్బుతరాజ్, వేలాంగని రూ.20 లక్షలు నష్టపరిహారం అందిస్తామని ఆశచూపిందన్నారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు