జన్మదిన వేడుకల్లో విషాదం

2 Jul, 2019 08:01 IST|Sakshi

సాక్షి,  హుస్నాబాద్‌ : మండలంలోని సుందరగిరి గ్రామంలో ఓ యువకుడి జన్మదిన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారి పక్కన నిలబడి ఉన్న నలుగురు యువకులను కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌ వెళ్తున్న లారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందగా ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..సుందరగిరి గ్రామానికి చెందిన అందె శంకర్‌ ఇంటి ఎదుట తన స్నేహితుడి జన్మదినం వేడుక జరుపుకుంటున్న సందర్భంలో ఎనగందుల అరుణ్‌కుమార్, రాకేశ్, జేరిపోతుల సాయికుమార్, అందె శంకర్‌ ఇంటిముందు నిలబడ్డారు.

రాత్రి 12 గంటల సమయంలో కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌ వైపు వెళ్తున్న (టీఎన్‌–52 ఎల్‌–3476) లారీ అదుపుతప్పి వారిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నలుగురిని 108లో కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలో ఎనగందుల అరుణ్‌కుమర్‌ మృతిచెందాడు. రాకేశ్, సాయికుమార్, శంకర్‌ చికిత్స పొందుతున్నారు. కాగా అరుణ్‌కుమార్‌కు తల్లిదండ్రులు రాజవ్వ–మల్లయ్య, ముగ్గురు అక్కాచెళ్లెల్లు ఉన్నారు. డిగ్రీ చదువుకున్నాడు. జీవనోపాధి కోసం పేయింటర్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై మామిడాల సురేందర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు