వీడిన ప్రియాంకా రెడ్డి మర్డర్‌ మిస్టరీ.. ఆ నలుగురే

29 Nov, 2019 11:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపులోకి తీసున్నారు. లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు కలిసి ప్రియాంకరెడ్డిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు నిర్ధారించారు. మహ్మద్‌ పాషా అనే వ్యక్తి(నారాయణపేట)ని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. తొండూపల్లి టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో చిత్రహింసలకు గురిచేసి.. ఆమెను హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు.

ఇక ప్రియాంకరెడ్డి పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం... ఆమెను దహనం చేసేందుకు నిందితులు కిరోసిన్ వాడినట్లు వైద్యులు తేల్చారు. శరీరానికి దుప్పట్లు చుట్టి.. ఆపై కిరోసిన్‌ పోసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆమె మృతదేహం 70 శాతం కాలినట్లు తెలిపారు. ఇక ప్రియాంకరెడ్డిని హత్య చేసిన అనంతరం.. ఘటనాస్థలం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఆమె మృతదేహాన్ని లారీలో తీసుకువెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాత్రి. 9.30 గంటల నుంచి తెల్లవారుజాము వరకూ అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి.. ఆమెను హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. 

నిందితుడు మహ్మద్‌ పాషా 

మద్యం మత్తులో మృగాళ్ల పైశాచి‍కత్వం
నగరంలో రాత్రి సమయంలో  లారీ నో ఎంట్రీ ఉండడంతో... తొండూపల్లి గేట్ వద్ద లారీ ఆపి నిందితులు మద్యం సేవించారు. ఈ క్రమంలో టోల్‌గేట్ వద్ద ఒంటరిగా ఉన్న ప్రియాంకరెడ్డిపై కన్నేశారు. అనంతరం స్కూటీ బాగు చేయిస్తామంటూ ఆమెకు మాయమాటలు చెప్పి తమతో తీసుకువెళ్లారు. లారీని అడ్డుపెట్టి అత్యాచారం చేసి... హతమార్చారు. ఆమె మృతదేహాన్ని దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో పడేసి.. ఇద్దరు బైక్‌పై, మరికొంత మంది లారీలో తిరుగు ప్రయాణం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

నివేదిక ఇవ్వండి: మహిళా కమిషన్‌
ఇక దేశ రాజధాని ఢిల్లీలోని నిర్బయ ఘటనను తలపిస్తున్న ప్రియాంకరెడ్డి ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును సుమోటాగా తీసుకుని... విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించేవరకు పోరాడుతామని స్పష్టం చేసింది. దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్‌ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్‌ ఓ లేఖ రాసింది. కేసు విచారణకు ఓ బృందాన్ని పంపుతున్నట్లు పేర్కొంది. కాగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారని.. ఇలాంటి దారుణ ఘటనలు జరిగితే మహిళలు స్వేచ్ఛగా ఎలా తిరగలుగుతారని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ ఆవేదన వ్యక్తం చేశారు. 

చదవండి: 

ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు
అప్పుడు  అభయ.. ఇప్పుడు ప్రియాంక!
ప్రియాంకారెడ్డి చివరి ఫోన్‌కాల్‌
నమ్మించి చంపేశారు!
ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

మరిన్ని వార్తలు