తొమ్మిది మంది ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్‌

3 Jun, 2018 09:48 IST|Sakshi
పట్టుబడిన స్మగ్లర్లు, దుంగలు, వాహనాలతో  డీఎïస్పీ లక్ష్మినారాయణ, సిబ్బంది

రైల్వేకోడూరు : నియోజకవర్గంలో వేరు వేరు చోట్ల దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది మంది ఎర్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు  డీఎస్పీ లక్ష్మినారాయణ తెలిపారు. శనివారం   ఆయన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఉర్లగట్టుపోడు పంచాయతీలోని కన్నెకుంట రోడ్డులో బుగ్గలవాగు పరిసర ప్రాంతాలలో గాలిస్తుండగా  పోలీసులపై స్మగ్లర్లు రాళ్లు, కట్టెలతో దాడిచేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఇందులో భాగంగా చాకచక్యంగా అక్కడున్న ఐదు ఎర్రచందనం దుంగలను, ఒక మహేంద్ర గూడ్స్‌ వాహనం, ఒక హీరో హోండా బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన దంతం వెంకటేష్, అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన బెల్డోనా మల్లయ్య, వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన నుగాలన్‌ అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న రూ. 2.30 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

అలాగే ఓబులవారిపల్లె మండలం వైకోట సమీపంలోని గుండాలేరు అటవీ ప్రాంతంలో 6 ఎర్రచందనం దుంగలను , ఒక ఆటోను స్వాధీనం  చేసుకున్నట్లు తెలిపారు. కె.బుడుగుంటపల్లె పంచాయతీ సమతానగర్‌కు చెందిన వెలుగు గంగయ్య, అల్లం మణి, రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన ఎలకచెర్ల సుదర్శన్‌ను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. అలాగే చిట్వేలి మండలం రాజుకుంట సమీపంలో  నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన వెంకటేష్, కన్నెకుంట ఎస్టీ కాలనికి చెందిన కమ్మల వెంకటరమణ,, తమిళనాడుకు చెందిన పూచి గోవ్నరాజ్‌లను అరెస్ట్‌ చేశామన్నారు. పై మూడు దాడుల్లో 15 దుంగలను, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సాయినాథ్, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె , చిట్వేలి ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, భక్తవత్సలం, సత్యనారాయణ, డాక్టర్‌ నాయక్‌లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు