తెలిసిన వాడే కాటేశాడు

25 Jul, 2019 11:30 IST|Sakshi

బాలికపై లైంగికదాడి

రామంతపూర్‌లో ఘటన

ఉప్పల్‌: బంధువే ఓ బాలికపై లైంగికదాడికి పల్పడిన సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో  మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.  శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన దంపతులు నగరానికి వలస వచ్చి రామంతాపూర్‌ ఇందిరానగర్‌లో ఉంటున్నారు. వీరి కుమార్తె (14) స్థానికంగా తొమ్మిదో తరగతి చదువుతోంది. సోమవారం రాత్రి చికెన్‌ తీసుకు వచ్చేందుకు బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఎదురైన ఆమె బంధువు మహేష్‌(25) బాలికకు మాయ మాటలు చెప్పి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని కేసీఆర్‌ నగర్‌లోని నిర్మాణంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికకు నీళ్లలో ఏదో కలిపి బలవంతగా తాగించాడు. స్పృహకోల్పోయిన బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిని గుర్తించి ఏడుస్తున్న బాలికను వారి ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లిపోయాడు. తమ కూతురు తిరిగి రాక పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు కాలనీల్లో గాలిస్తుండగా ఏడ్చుకుంటూ వస్తున్న ఆమెను గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.   నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టాల కింద  కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ రవిబాబు తెలిపారు.

కఠినంగా శిక్షించాలి
బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం  గౌరవాధ్యక్షులు అచ్యుతరావు అన్నారు. నగరంలో బాలికలపై తరచూ లైంగికదాడులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. బాధితులకు ఆర్థిక సహాయం, కౌన్సిలింగ్‌ అంశాల్లో రెవెన్యూ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు