దారుణాతి దారుణం.. పోలీసులూ స్పందించలేదు

15 Jul, 2018 09:35 IST|Sakshi

మరో దారుణాతి దారుణమైన ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఓ వివాహితపై అఘాయిత్యానికి పాల్పడ్డ దుండగులు.. తిరిగొచ్చి దాష్టీకానికి పాల్పడ్డారు. దగ్గరల్లోనే ఓ ఆలయంలోకి ఈడ్చుకెళ్లి మరీ సజీవ దహనం చేశారు.  పూర్తి వివరాల్లోకి వెళ్తే... 

సంభల్‌ జిల్లాలోని రాజాపుర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త ఘజియాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటుండగా.. సదరు మహిళ(35) ఇద్దరి పిల్లలతో గ్రామంలోనే ఉంటోంది. శనివారం వేకువ ఝామున ఇంట్లోకి దూసుకొచ్చిన ఐదుగురు దుండగులు ఆమెపై గ్యాంగ్‌ రేప్‌ చేశారు. ఆపై నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోగా.. ఆమె 100 హెల్ప్‌లైన్‌ సెంటర్‌కి ఫోన్‌ చేసింది. అయితే అవతలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో.. భర్త, సోదరుడిపై ఫోన్‌ కాల్స్‌ చేసింది. వాళ్లు పోలీసులను అప్రమత్తం చేసే లోపే.. తిరిగొచ్చిన నిందితులు ఆమెను దగ్గర్లోనే ఓ ఆలయంలోకి లాక్కెల్లారు. అక్కడ యజ్ఞశాలలో ఆమెపై కిరోసిన్‌ పోసి తగలబెట్టారు.
   
ఆడియో క్లిప్‌ కీలకం... కాగా, ఘటన తర్వాత స్థానిక మహిళలను క్లూస్‌ టీమ్‌ను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏడీజీ ప్రేమ్‌ ప్రకాశ్‌ వారిని సుముదాయించారు. ‘100కు కాల్‌ చేసిన స్పందించలేదన్న విమర్శలు వచ్చాయి. దర్యాప్తుకు ఆదేశించాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. బాధితురాలు ఫోన్‌కాల్‌లో నిందితుల పేర్లు వెల్లడించింది. ఆ ఆడియో క్లిప్‌ ఈ కేసులో సాక్ష్యంగా కీలకం కానుంది. ఐదుగురు నిందితులను గుర్తించాం. వారి కోసం గాలింపు చేపట్టాం’ అని ప్రేమ్‌ ప్రకాశ్‌ వెల్లడించారు.

అత్యాచారం నిజంకాదు: ఎస్పీ ... అయితే ఈ ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని, నిందితుల ఉద్దేశం వేరే ఉందని సంభల్‌ ఎస్పీ ఆర్‌ఎమ్‌ భరద్వాజ్‌ వెల్లడించారు. శనివారం ఉదయం ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. నిందితులంతా స్థానికులేనన్న ఆయన.. త్వరలో అరెస్ట్‌ చేసి, ప్రెస్‌మీట్‌లో  అసలు వివరాలు వెల్లడిస్తామని భరద్వాజ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు