చికిత్స పొందుతున్న యువతి కన్నుమూత

11 Apr, 2018 10:02 IST|Sakshi
నవీన (ఫైల్‌)

బషీరాబాద్‌(తాండూరు): ఈ నెల 7న ఆత్మహత్యాయత్నం చేసిన యువతి నవీనణ(18) చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూసింది. తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని మనస్థాపానికి గురై ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. బషీరాబాద్‌ మండలం మాసన్‌పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ, లక్ష్మయ్యల కూతురు వడ్డె నవీన వారం రోజుల కిందట తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకుంది. కొత్త సెల్‌ఫోన్‌ కావాలని మారం చేయడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన కూతురు ఆవేశంతో ఇంట్లో ఉన్న కిరోసిన్‌ ఒంటిపై పోసుకొని తల్లిదండ్రుల ఎదుటే నిప్పంటించుకుంది.

తల్లిదండ్రులు వెంటనే మంటలను ఆర్పారు. అప్పటికే తల, ముఖం ఛాతి భాగాలపై తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా రెండు రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మయ్య తెలిపారు. 

మరిన్ని వార్తలు