అనారోగ్యంతో టీపీసీసీ సభ్యుడి మృతి 

11 May, 2018 08:23 IST|Sakshi
విష్ణువర్ధన్‌రెడ్డి (ఫైల్‌)

నారాయణఖేడ్‌ : మాజీ ప్రభుత్వ న్యాయవాది టీపీసీసీ సభ్యులు పి.విష్ణువర్ధన్‌రెడ్డి(50) అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గోదుమగామలో జన్మించిన విష్ణువర్ధన్‌రెడ్డి చిన్నతనం నుంచి నారాయణఖేడ్‌లో మేనమామ దివంగత మాజీ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ఆధ్వర్యంలో నారాయణఖేడ్‌లో చదువుకొని న్యాయవాదిగా పట్టాపొంది సేవలందించారు. రెండుమార్లు దాదాపు పదేళ్ళపాటు సంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సమర్థవంతంగా విధులు నిర్వహించారు.

ప్రస్తుతం జుక్కల్‌ నియోజకవర్గం నుంచి టీపీసీసీ సభ్యులు కూడా కొనసాగుతున్నారు.   ఆయన గత కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురి కావడంతో కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. న్యాయవాది విష్ణువర్ధన్‌రెడ్డి మృతి చెందడం పట్ల పలువురు న్యాయవాదులు సంతాపాన్ని ప్రకటించారు. విష్ణువర్ధన్‌రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపై టీపీసీసీ సభ్యులు సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు భోజిరెడ్డిలు సంతాపం తెలిపారు.  
 

మరిన్ని వార్తలు