వైద్యుడి నిర్లక్ష్యంతో కుక్క మృతి | Sakshi
Sakshi News home page

వైద్యుడి నిర్లక్ష్యంతో కుక్క మృతి

Published Fri, May 11 2018 8:29 AM

Dog Died With Veterinary Doctor Negligence In Hyderabad - Sakshi

చిలకలగూడ: వెటర్నరీ వైద్యుని నిర్లక్ష్యం కారణంగానే కుక్క మృతి చెందిందని ఆరోపిస్తు ఓ జంతు ప్రేమికురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. చిలకలగూడ పోలీసులు, జంతు ప్రేమికురాలు రాధాకుమారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గత నెల 10న  బాగ్‌లింగంపల్లి రోడ్డుపై పడి ఉన్న కుక్కపిల్లను అదేప్రాంతానికి చెందిన రాధ గుర్తించి చేరదీసింది. నారాయణగూడలోని ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రిలో గత కొద్దిరోజులుగా దానికి చికిత్స చేయిస్తోంది.

రెగ్యులర్‌గా వైద్యం అందించే డాక్టర్‌ సెలవుపై వెళ్లడంతో మరో వైద్యుడు బేగ్‌ కుక్కపిల్లకు వైద్యసేవలు అందించాడు. కుక్కపిల్లకు తక్షణమే సర్జరీ చేయాలని సూచించిన అతను బౌద్ధనగర్‌లోని తన ప్రైవేటు ఆస్పత్రి కెన్నెల్‌ స్మార్ట్‌ క్లినిక్‌కు తీసుకువస్తే సర్జరీ చేస్తానని చెప్పాడు. ఆపరేషన్‌కు ముందు రెండు డోసుల మత్తుమందు ఇచ్చాడు. దీనికి రాధాకుమారి అడ్డు చెప్పినా ఇబ్బంది లేదని డాక్టర్‌ పేర్కొన్నాడు. మరుసటి రోజు శ్వాస ఆడక కుక్కపిల్ల మృతి చెందింది. మత్తుమందు ఎక్కువ ఇవ్వడంతోపాటు  సర్జరీ అనంతరం కుట్లుకూడా సరిగా వేయలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈనెల 1న పోలీసులకు ఫిర్యాదు చేయగా, న్యాయనిపుణుల సలహామేరకు గురువారం సాయంత్రం కేసు నమోదు చేశారు. డాక్టర్‌ బేగ్‌పై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిలకలగూడ ఎస్‌ఐ బ్రహ్మచారి తెలిపారు.

Advertisement
Advertisement