సరిగా చదవడం లేదని బాలికను చితకబాదిన వైనం
కర్ణాటక ,చింతామణి : లెక్కలు నేర్చుకోవడం లేదని ఓ ఉపాధ్యాయుడు ఏడేళ్ల బాలికను తీవ్రంగా చితకబాదిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాలూకాలోని యర్రకోట గ్రామ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. వివరాలు... సదరి గ్రామానికి చెందిన హరీష్ కుమార్తె రంజిని (7) అదే గ్రామంలోని పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. బుధవారం చిన్నారి పాఠశాలకు వచ్చింది. ఉపాధ్యాయుడు శ్రీనివాస్ లెక్కలు సరిగా చెప్పడం లేదని కర్రతో వీపు, చేతులపై చితకబాదాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన చిన్నారికి జ్వరం వచ్చింది. అదే రోజు రాత్రి చింతామణి ఆస్పత్రికి తీసుకువచ్చారు. తల్లిదండ్రులు ఆరా తీయగా రంజని అసలు విషయం చెప్పింది. వీపుపై వాతలు చూసిన తల్లిదండ్రులు చలించిపోయారు. వెంటనే ఉపాధ్యాయుడిపై బీఈఓకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.