అర్ధరాత్రి నాలుగిళ్లలో చోరీ

13 Jun, 2018 09:16 IST|Sakshi
 యూసూఫ్‌జానీ ఇంట్లో తనిఖీలు 

మర్పల్లి: మండల కేంద్రంలో సోమవారం రాత్రి 4 ఇండ్లలో చోరీ జరిగింది. ఓ ఇంట్లో నగదుతో పాటు వెండి నగలు అపహరణకు గురయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..  మండల కేంద్రానికి చెందిన మహ్మద్‌ ఇర్శత్‌ హైదరాబాద్‌లో దినసరి కూలీగా పనిచేస్తుంటాడు.

ఇర్శత్‌ తల్లి షాహదాబేగం, ఆయన భార్య ఆఫ్రీన మర్పల్లిలోనే ఉంటారు. సోమవారం రాత్రి షాహదాబేగం, ఆఫ్రీన గ్రామంలోనే ఇఫ్తార్‌ విందుకు వెళ్లారు. ఇఫ్తార్‌ ముగిసన తర్వాత అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇంటికి రాగా తాళం పగలగొట్టి ఉంది.

ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న రూ. 5 వేల నగదు, 20 తులాల పట్టగొలుసులు, బంగారు చెవిపోగులు కనిపించలేదు. సమీపంలో ఉన్న యూసూఫ్‌జీ,  ఉదయభాను, నర్సింలు ఇండ్ల తాళాలను దొంగలు పగులగొట్టారు.

ఇంట్లో ఉన్న వస్తువులను చిందర వందరగా చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై విఠల్‌రెడ్డి మంగళవారం ఉదయం వికారాబాద్‌ నుండి డాగ్‌ స్క్వాడ్‌ (జాగిలాలు)ను రప్పించాడు. బాధితుల ఇండ్ల నుండి గ్రామం సమీపంలోని బూచన్‌పల్లి చౌరస్తా వద్దకు జాగిలాలు వెళ్లి ఆగాయి. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు