ఏకంగా బస్‌షెల్టర్‌నే మాయం చేశారు

6 Oct, 2023 06:15 IST|Sakshi

శివాజీనగర: ఇనుప వంతెనలు, భారీ వస్తు సామగ్రిని మాయం చేస్తున్న దొంగల కళ్లు..ఇప్పుడు బస్‌ షెల్టర్‌పై పడ్డాయి. బెంగళూరు నగరం నడిబొడ్డున నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి దగ్గర్లో ఉన్న సిటీ బస్‌ షెల్టర్‌ను దొంగలు ఎత్తుకుపోయారు. ఒక ప్రైవేటు సంస్థ విరాళంగా అందజేసిన రూ.10 లక్షలతో స్థానిక కన్నింగ్‌హం రోడ్డులో బెంగళూరు మెట్రో సిటీ బస్‌ సంస్థ (బీఎంటీసీ) ఏడాదిన్నర క్రితం స్టీల్, ఇనుప రాడ్‌లు, షీట్లతో బస్‌షెల్టర్‌ను ఏర్పాటు చేసింది.

కొన్నిరోజులుగా అక్కడ బస్సు షెల్టర్‌ స్థానం ఖాళీగా కనిపిస్తుండటంతో అధికారులే తొలగించి ఉంటారని స్థానికులు భావించారు. సదరు ప్రైవేటు సంస్థకు విషయం తెలిసి కార్పొరేషన్‌ అధికారులను ఆరా తీశారు. ఈ విషయం బయటకు రావడంతో స్థానికులు వారం క్రితం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలతో పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు