ఫోర్జరీ డాక్యుమెంట్‌తో కోటి ప్లాట్‌

14 May, 2018 14:49 IST|Sakshi
నిందితులు రాజేశ్వర్‌ రెడ్డి, ఉమా

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ.1.5 కోట్ల విలువైన ప్లాట్‌ విక్రయించిన ముగ్గురు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ గంగాధర్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హిమాయత్‌నగర్‌కు చెందిన రూపా డిసిల్వకు కొండాపూర్‌ సర్వేనెంబర్‌ 218 క్రాంతివనం లేఅవుట్‌లో 300 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్‌ నెంబర్‌ 434 ఉంది.  పార్శిగుట్టకు చెందిన ఉమా అలియాస్‌ ఉమా మహేశ్వరి ఫొటోతో నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసి, ఆమెను రూపా డిసిల్వాగా పేర్కొంటూ నంద్యాలకు చెందిన సబ్బాని రాజేశ్వర్‌రెడ్డి ఏజీపీఏ చేసుకున్నాడు.

పార్శిగుట్టుకు చెందిన సామ్యూల్‌ ఇందుకు అవసరమైన  పత్రాలు సృష్టించడంలో కీలక పాత్ర పోషించారు. వీటి ఆధారంగా రాజేశ్వర్‌ రెడ్డి, శ్యామ్యూల్‌ అమెరికాలో ఉంటున్న శరత్‌ చంద్రారెడ్డికి ప్లాట్‌ విక్రయించారు. శరత్‌ తండ్రి మనోహర్‌ రెడ్డి ప్లాట్‌ను చదును చేస్తుండగా 2017 నవంబర్‌లో రూపా డిసిల్వ గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో నిందితులగా ఉన్న రామ్మోహన్‌ రెడ్డి, సంజీవ, చక్రీ, జాన్‌ వెస్లీ, అంకిరెడ్డి అనే వ్యక్తులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు