ప్రాణం తీసిన అతివేగం

27 Aug, 2018 15:19 IST|Sakshi
షేక్‌ జలీల్‌ మృతదేహం  

భూత్పూర్‌ (దేవరకద్ర): వాహనదారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. అతివేగం కారణంగా క్వాలీస్‌ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన ఆదివారం మండలంలోని పోతులమడుగు వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గం జెలదుర్గం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన షేక్‌ నడిపి జమాల్‌వలీ, షేక్‌ జలీల్, జమాల్‌ బాష, హుస్సేన్, జహీనాబీ, షేక్‌ హబీబ్‌లు కలిసి ఆదివారం క్వాలీస్‌లో హైదరాబాద్‌ వెళ్తున్నారు.

పోతులమడుగు వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తుండగా అదుపు తప్పి కుడిచేతివైపు ఉన్న డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న షేక్‌ నడిపి జమాల్‌ వలీ(50), షేక్‌ జలీల్‌(5) అక్కడికక్కడే మృతిచెందగా.. జమాల్‌ బాష, హుస్సేన్, జహీనాబీ, òషేక్‌ హబీబ్‌ గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను 108లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 

లారీని ఢీకొని వ్యక్తి.. 

జడ్చర్ల: స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి వెనక నుంచి లారీని ఢీకొని మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని మల్లెబోయిన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భూత్పూర్‌ మండలం కొత్తమొల్గరకు చెందిన చిన్న కాశన్న(50), పెద్ద కాశన్నలు స్కూటీపై శనివారం రాత్రి జడ్చర్లకు వస్తుండగా మల్లెబోయిన్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టారు. దీంతో స్కూటీ నడుపుతున్న చిన్న కాశన్న అక్కడికక్కడే మృతిచెందగా.. పెద్ద కాశన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రుడిని 108లో ఏనుగొండ ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి తర లించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజు తెలిపారు. 

రూ.1.14 లక్షల నగదు 

చిన్నకాశన్న వద్ద లభించిన బ్యాగులో రూ.1.14 లక్షల నగదు ఉన్నట్లు 108 అంబులెన్స్‌ సిబ్బంది శివారెడ్డి తెలిపారు. వెంటనే బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారికి నగదు అప్పగించారు.  

మరిన్ని వార్తలు