డ్రైవర్‌ నిద్రమత్తు.. ఘోర రోడ్డు ప్రమాదం

30 Jan, 2019 13:56 IST|Sakshi

భువనేశ్వర్‌: డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కలహండీ నుంచి భువనేశ్వరం వెళ్లే జగన్నాథ ప్రైవేటు బస్సు అదుపుతప్పి భారీ చెట్టును ఢీకొట్టింది. రాయగడ జిల్లా సరిహద్దు ప్రాంతం అయిన కలహండీ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బస్సు మొత్తం నుజ్జునుజ్జు అయింది. ఈ దారుణ సంఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 30 మందికి స్వల్పగాయాలయ్యాయి.

స్థానికులు, ఆ రోడ్డులో వెళుతున్న ప్రయాణికులు వెళ్లి క్షతగాత్రులకు సపరియలు చేసి, పలువురికి ఆస్పత్రికి తరలించారు. కాగా, డ్రైవర్‌ బస్సు స్పీడుగా నడుపుతూ నిద్రపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలహండీ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు