ఢిల్లీ : తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలంటూ వేధిస్తున్నాడన్న కోపంతో ఇద్దరు వ్యక్తులు స్నేహితున్ని దారుణంగా హత్య చేశారు. ఆ హత్యనుంచి తప్పించుకోవటానికి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘనట ఢిల్లీలోని తిమర్పూర్లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన మన్ను వాద్వా, నితిన్ చబ్రా, పవన్ బత్లాలు స్నేహితులు. వాద్వా, నితిన్ చబ్రాలు అవసరం నిమిత్తం పవన్ వద్ద రెండున్నర లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు.
అప్పు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా అప్పు తీర్చకపోవటంతో పవన్ వారిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో వారు అతడిపై కక్షగట్టి చంపాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం రాత్రి సమయంలో ఢిల్లీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిమర్పూర్కు రావాల్సిందిగా అతన్ని కోరారు. స్నేహితుల కోరిక మేరకు అక్కడిచేరకున్న పవన్పై కత్తితో దాడి చేశారు. అనంతరం హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలనే ఉద్ధేశ్యంతో పవన్ కారును అక్కడి కొద్దిదూరంలోని పీతమ్పురలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యారు. దాడి జరిగిన కొద్దిసేపటికి తీవ్ర గాయాలతో పడిఉన్న పవన్ను గుర్తించిన కొందరు ఆసుపత్రికి సమాచారమిచ్చారు.
అక్కడి చేరుకున్న అంబులెన్స్ పవన్ను ఆసుపత్రికి తరలించగా అతడు మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానస్పదమృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పవన్ మృతి చెందడానికి మందు రోజు అతడు మాట్లాడిన కాల్ డేటా ఆధారంగా మన్ను వాద్వా, నితిన్ చబ్రాలను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నారు. అధిక వడ్డీ వసూలు చేస్తూ హింసిస్తున్న కారణంగానే హత్య చేసినట్లు అంగీకరించారు.