రాజేంద్రనగర్ : నార్సింగి మూసీ కల్వర్టు ప్రాంతంలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన శుక్రవారం నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎక్కడో హత్య చేసి ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ఆనవాళ్లు గుర్తించకుండా పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని మాదాపూర్ ఏసీపీ శ్యామ్ప్రసాద్ సందర్శించారు. పోలీసుల వివరాల ప్రకారం.. 30 ఏళ్ల వయసు ఉన్న మహిళ మృతదేహం కాలిన స్థితిలో మూసీ కల్వర్టు వద్ద పడి ఉందని నార్సింగి గ్రామ రెవెన్యూ ఉద్యోగి యాదయ్య పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా మొత్తం కాలి పూర్తిగా ఆనవాళ్లు గుర్తించకుండా కాలిన స్థితిలో ఉంది. ఒంటిపై ఎలాంటి బట్టలు లేకపోవడంతో పాటు ఎలాంటి ఆనవాళ్లు లేవు. సంఘటన స్థలానికి కొద్దిదూరంలో పెట్రోల్ డబ్బా కనిపించింది. గురువారం అర్ధరాత్రి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువచ్చి దహనం చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
సంఘటన స్థలానికి డాగ్స్క్వాడ్ను రప్పించగా రోడ్డు వరకు వెళ్లి ఆగిపోయాయి. ఎక్కడో హత్య చేసి వాహనంలో ఈ ప్రాంతానికి తీసుకువచ్చి పడేసి ఉంటారని పోలీ సులు అనుమానిస్తున్నారు. ఆనవాళ్లు గుర్తించకుం డా కాల్చివేసి ఉండవచ్చని భావిస్తున్నారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారా? లేక హత్య చేసిన అనంతరం ఇక్కడకు తీసుకువచ్చారా అనేది పోస్టుమార్టం నివేదికలో తేలనుందని పోలీసులు వెల్లడించారు. ప్రధాన రహదారులతో పాటు ఓఆర్ఆర్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.