మధ్య వయసు మహిళలు టార్గెట్‌.. శవాలతో వికృత చర్య

4 Jun, 2019 15:53 IST|Sakshi

కోల్‌కతా : తెలంగాణలో సంచలనం సృష్టించిన హాజీపూర్‌ సైకో, సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌ రెడ్డి చేసిన దారుణాలు తల్చుకుంటే.. ఇప్పటికి ఒళ్లు జలదరిస్తుంది. చిన్నారులను, యువతులను దారుణంగా చంపి వారి శవాలతో పశువాంఛ తీర్చుకున్న వైనం సామాన్యులతో సహా పోలీసులను కూడా కలవరపెట్టింది. ఇలాంటి సైకోనే ఒకడు పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. సైకిల్‌ చైన్‌, ఇనుప రాడ్‌తో మహిళలను చంపి.. రక్తంలో తడిసిన వారి శరీరాలతో తన పశువాంఛ తీర్చుకునేవాడు. ఇలా ఇప్పటికి ఐదుగురు మహిళల్ని దారుణంగా హతమార్చాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.

వివరాలు.. పశ్చిమ బెంగాల్‌ బర్డ్వాన్‌ జిల్లాకు చెందిన కమ్ముర్జమాన్‌ సర్కార్‌(42) చిరు వ్యాపారి. మధ్యాహ్నం పూట ఒంటరిగా ఉండే మహిళల్ని టార్గెట్‌ చేసుకుని దారుణాలకు పాల్పడేవాడు. కరెంట్‌ బిల్లులు పేరుతో ఇంట్లో ప్రవేశించేవాడు. అదును చూసి మహిళ తల మీద ఇనుప రాడ్‌తో బాదేవాడు. అప్పటికి వారు చనిపోకపోతే.. మెడకు సైకిల్‌ చైన్‌ బిగించి హత్య చేసేవాడు. అనంతరం ఆ మృతదేహాలతో తన వికృత కోరిక తీర్చుకునే వాడు. 2013 నుంచి ఇలాంటి దారుణాలు జరుపుతుండగా.. గత నెలలో ఇతని పాపం పండి పోలీసులకు చిక్కాడు. గత నెల 21న గోరా గ్రామంలో ఓ మహిళను ఇలాగే అంతమొందించి పోలీసులకు చిక్కాడు. విచారణలో అతని దారుణాలు ఒక్కోటి వెలుగులోకి వచ్చాయి.

2013 నుంచి ఇప్పటి వరకూ ఇదే విధంగా నలుగురు మహిళలు హత్యకు గురయ్యారు. వాటిలో సర్కార్‌ పాత్ర గురించి పోలీసులు అతన్ని ప్రశ్నించగా.. ఆ హత్యలను తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. తన మీద అనుమానం రాకుండా ఉండటం కోసం హత్య చేసిన ఇంటి నుంచి కొన్ని విలువైన వస్తువులను తీసుకెళ్లేవాడినని.. దాంతో అందరి దృష్టి దొంగల మీదకు వెళ్లేదని సర్కార్‌ విచారణలో వెల్లడించాడు. ఇప్పటి వరకూ సర్కార్‌ చేతిలో బలైన వారంతా మధ్యవయసు మహిళలే కావడం గమనార్హం. సర్కార్‌కు వివాహం అయ్యిందని.. ముగ్గురు సంతానం కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భార్యతో గొడవల నేపథ్యంలోనే ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు అతన్ని 12 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు