అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని...

9 Mar, 2019 12:56 IST|Sakshi
నిందితులు గాయత్రి, కిరణ్‌కుమార్

దొడ్డబళ్లాపురం : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను దొడ్డ తాలూకా దొడ్డబెళవంగల పోలీసులు అరెస్టు చేశారు. తాలూకాలోని కోడిహళ్లి గ్రామానికి చెందిన గాయిత్రి (35), ఈమె ప్రియుడు కిరణ్‌కుమార్‌ ఆలియాస్‌ గిడి (20), హత్య చేయడానికి వీరితో సహకరించిన మరో మైనర్‌ బాలుడు (కిరణ్‌ తమ్ముడు) అరెస్టయ్యారు. నిందితులు గతనెల 24న తాలూకాలోని ఉజ్జిని అరణ్య ప్రదేశంలో ఉమేశ్‌ అనే వ్యక్తిని గొంతు నులిమి, తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు....నిందితుడు కిరణ్‌కుమార్‌ కోడిహళ్లి గ్రామంలో తప్పెట వాయించే పని చేసేవాడు. ఇదే గ్రామం నివాసి హతుడు ఉమేశ్‌ భార్య గాయత్రికి కిరణ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన ఉమేశ్‌ ప్రవర్తన మార్చుకోమని భార్యను హెచ్చరించాడు. ఈ విషయంలో భార్యాభర్తలకు గొడవలయ్యేవి.

చివరకు గాయత్రి ఉమేశ్‌ను హతమార్చాలని కిరణ్‌ సాయం కోరింది. పథకం ప్రకారం కిరణ్‌ ఫిబ్రవరి 23న ఉమేశ్‌ను తాలూకాలోని తన స్వగ్రామం రాజఘట్టలో పని ఉందని తన బైక్‌పై తీసికెళ్లాడు. ఆరోజు ఇంట్లోనే ఉంచుకుని మరుసటిరోజు తన తమ్ముడితో కలిసి ఉమేశ్‌ను ఉజ్జిని సమీపంలోని అరణ్య ప్రాంతానికి తీసికెళ్లి వైర్‌తో గొంతు నులిమి, తరువాత తలపై బండరాయితో మోది హతమార్చాడు. అనంతరం ఏం తెలీనివాడిలా తన పనిలో మునిగిపోయాడు. ఫిబ్రవరి 26న చన్నేగౌడ అనే వ్యక్తి ఉజ్జిని అరణ్యప్రాంతానికి వెళ్లగా కుళ్లిపోయిన శవం కనిపించింది. తక్షణం ఆయన పోలీసులకు సమాచారమిచ్చాడు. కేసు నమోదు చేసుకున్న దొడ్డబెళవంగల పోలీసులు శవాన్ని గుర్తించి దర్యాప్తు చేయగా గాయత్రి గుట్టురట్టయింది. దీంతో క్షణికావేశానికి లోనై అక్రమ సంబంధం పెట్టుకుని గాయిత్రి, ప్రియుడు, ప్రియుడి తమ్ముడితో పాటు జైలుపాలైంది.

మరిన్ని వార్తలు