భర్త రెండో పెళ్లి ఏర్పాట్లపై ఫిర్యాదు

21 Aug, 2018 08:01 IST|Sakshi
ఆర్టీసీ డ్రైవర్‌ కృష్ణ, బంగారులక్ష్మి పెళ్లినాటి ఫొటో (పాతచిత్రం)

ఎంవీపీ పోలీసులను ఆశ్రయించిన భార్య

పెదవాల్తేరు(విశాఖ తూర్పు): తన భర్త రెండో పెళ్లికి సన్నాహాలు  చేసుకున్నాడని ఒక మహిళ ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని హెచ్‌బీకాలనీకి చెందిన బంగారు లక్ష్మికి 2006 జూన్‌ 20వ తేదీన కొయ్యూరు మండలం కాకరపాడు గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ నండ్రు కృష్ణతో వివాహం జరిగింది. వీరికి 2009లో కుమారుడు జన్మించాడు. కాగా, బంగారులక్ష్మి 2014 సంవత్సరంలో విజయనగరం జిల్లా ఎస్‌.కోటలోని వివేకానంద డైట్‌ కళాశాలలో టీచర్‌ ట్రైనింగ్‌ చేస్తున్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి బంగారు లక్ష్మితో మాట్లాడడం భర్త చూశాడు.

అప్పటి నుంచి అనుమానం పెంచుకున్న కృష్ణ భార్యని హింసిస్తున్నాడు. దీంతో ఆమె కుమరుడితో కలిసి పుట్టింటికి వచ్చేశారు. భార్య కాపురానికి రాకపోవడంతో భర్త కృష్ణ నర్సీపట్నం కోర్టులో కేసు వేశాడు. ఈ నేపథ్యంలో గిరిజన యువతి వంతల కొండమ్మను రెండో పెళ్లి చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలియడంతో బంగారులక్ష్మి  పోలీస్‌ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. సీపీ సూచనల మేరకు ఆమె ఎంవీపీ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. కేసుని ఎంవీపీ స్టేషన్‌ సీఐ కె.ఈశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు