వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

14 Oct, 2018 10:12 IST|Sakshi
హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌

త్రిపురారం(నాగార్జునసాగర్‌) : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ భార్య. గత మార్చి 17న జరిగిన ధార శ్రీనయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. శనివారం హలియా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్, çహాలి యా సీఐ ధనుంజయగౌడ్‌ హత్య కేసు వివరాలు వెల్లడించారు. పెద్దఅడిశర్లపల్లి మండలం ఘనిపల్లి గ్రామానికి చెందిన ధార శ్రీనయ్య, భార్య వాణితో కలిసి బతుకుదెరువు కోసం నాలుగేళ్ల కిత్రం హాలియాకు వచ్చాడు. హాలియాలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఇదే ఇంట్లో మరో పక్క పోర్షన్‌లో మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన బచ్చు వెంకట్‌రెడ్డి ఉంటున్నాడు.

ఈయన హాలియాలో ఫొటోస్టూ డియో నిర్వహిస్తున్నాడు. ధార శ్రీనయ్య లారీడ్రైవర్‌ కావడంతో నెలలో ఎక్కువ రోజుల పాటు ఇతర ప్రాంతాలకు తిరుగుతూ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఒకే ఇంట్లో పక్కపక్కనే నివాసం ఉంటున్న ధార వాణి, బచ్చు వెంకట్‌రెడ్డిల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ధార శ్రీనయ్యకు తెలియడంతో భార్య వాణిని పలుమార్లు మందలించాడు. అయినా తనలో ఏ మార్పు రాకపోవడంతో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

తన వివాహేతర సంబంధానికి ధార శ్రీనయ్య అడ్డుగా వస్తున్నాడని భావించిన వాణి, వెంకట్‌రెడ్డి అతన్ని అంతమొందించాలని పథకం పన్నారు. వెంకట్‌రెడ్డి నందిపాడు గ్రామానికి చెందిన తన స్నేహితులు జోగు వినోద్‌రెడ్డి, నేరేళ్ల మహేష్‌తో కలిసి పథకాన్ని అమలు చేశారు. ఈక్రమంలో గత మార్చి 17వ తేదీన భార్య వాణి, వెంకట్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, మహేష్‌ కలిసి తన ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనయ్యను గొంతు నులిమి, ఎదురొమ్ముపై బాగా కొట్టారు. బలమైన దెబ్బలకు శ్రీనయ్య స్పృహ కొల్పోయాడు. నిందితులు శ్రీనయ్యను ఓ మోటార్‌బైక్‌పై కూర్చొబెట్టుకుని హాలియా సమీపంలో ఉన్న ఎడమకాల్వలో పడేశారు.

వెలుగులోకి వచ్చిందిలా..
శ్రీనయ్య తమ్ముడు ధార రమేశ్‌ ఈనెల 10న తన సొంత పనినిమిత్తం పెద్దఅడిశర్లపల్లి మండలంలోని గుడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. రమేశ్‌కి పోలీస్‌స్టేషన్‌లో నోటీస్‌ బోర్డుపై ఉన్న గుర్తుతెలియని మృతదేహం అని ఓ ఫొటో కనిపించింది. మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులు, ముఖ కవలికలను గుర్తించి రమేశ్‌ తన సోదరుడి మృతదేహం గా భావించాడు. ఈ విషయంపై మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేయగా డీఎస్పీ హాలియా సీఐ ధనుంజయగౌడ్‌కు కేసుకు సంబం ధించిన బాధ్యతలను అప్పగించాడు. సీఐ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టారు.

ఈక్రమంలో ప్రత్యేక బృందం పోలీసులకు ఫొటో స్టూడియో నడుపుతున్న వెంకట్‌రెడ్డిపై అనుమానం వచ్చి ఆరా తీశారు. వెంకట్‌రెడ్డి వనపర్తి జిల్లా కొత్తపేటలో ఉంటున్నాడని తెలిసి పోలీస్‌ బృందం అక్కడకు వెళ్లి వెంకట్‌రెడ్డిని అతనితో పాటు ఉంటున్న ధార వాణిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీనయ్య భార్య వాణితో పాటు వెంకట్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, మహేశ్‌లను విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్‌ చేశారు. కేసును ఛేదించిన సీఐ ధనుంజయగౌడ్‌తో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు