ఒకరు నమ్మించి... మరొకరు బెదిరించి 

19 Dec, 2019 10:22 IST|Sakshi

యువతిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులు 

చీపురుపల్లి రూరల్‌: ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి వాంఛ తీర్చుకున్నాడు. చివరికి ఆ వ్యక్తి మాయమాటల్లో పడి ఆ యువతి మోసపోయింది. అదే గ్రామానికి చెందిన మరో యువకుడు వీరద్దరి ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకొని శారీరక వాంఛ తీర్చాలంటూ ఆ యువతిని భయపెట్టాడు. వారి ప్రేమ వ్యవహారాన్ని గ్రామంలో చెప్పి బయట పెడతానని చెప్పి బెదిరించాడు. ఈ వ్యవహారం గ్రామంలో తెలిస్తే తమ కుటుంబం పరువు ఎక్కడ పోతుందోనని భయపడిన ఆ యువతి ఆ యువకుడికి కూడా లొంగిపోయింది.

ఇలా కొన్నాళ్లు గడిచిన తరువాత ఆ యువతిలో శారీరక మార్పులు రావటంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆ యువతిని ఏమయ్యిందని ఇంట్లో నిలదీశారు. విషయం తెలుసుకొని డాక్టర్‌ వద్దకు తీసుకువెళ్లగా ఆమె గర్బవతి అయిందని తేలింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని రామలింగాపురం పంచాయతీ పరిధి పుర్రేయవలస గ్రామంలో ఈ ఘటన జరిగింది. పుర్రేయవలస గ్రామానికి చెందిన వివాహితుడు సంగిరెడ్డి రామారావు అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. ఈ విషయం తెలుసుకున్న మరో యువకుడు బూటు పైడిరాజు ఆ యువతిని బెదిరించి వాంఛ తీర్చుకున్నాడు. ఆమె గర్భవతి కావడంతో గ్రామ పెద్దలకు తెలియజేసింది. అక్కడ న్యాయం జరగకపోవడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు