గుర్తుతెలియని మహిళ దారుణహత్య

11 Aug, 2018 12:43 IST|Sakshi
మహిళను హత్యచేసిన పాడుబడ్డ ఆశ్రమం

గొంతు కోసి, పెట్రోల్‌ పోసి కాల్చివేశారు

మనుబోలు మండలంలో చోటుచేసుకున్న ఘటన  

మనుబోలు: గుర్తుతెలియని మహిళను దారుణంగా హత్యచేసి ఆపై శవాన్ని మాయం చేసేందుకు పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఈ ఘటన మండల పరిధిలోని హైవే పక్కనే వీరంపల్లి ఫ్లై ఓవర్‌ సమీపంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు వివరాలు.. వీరంపల్లి ఫ్లై ఓవర్‌ సమీపంలో ఉన్న పాడుబడ్డ వెంకయ్యస్వామి ఆశ్రమం వెనుక ఓ మహిళ మృతదేహం గుర్తుపట్టలేనంతగా కాలిపోయి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గూడూరు సీఐ లక్ష్మణరావు, మనుబోలు ఎస్సై శ్రీనివాసులురెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మహిళ వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

ఆశ్రమం వరండాలో ఓ చిన్న బ్లేడు చాకు, రక్తపు మరకలు కనిపించాయి. మహిళ గొంతు కోసి హత్య చేసి ఆపై పెట్రోల్‌ పోసి మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీపంలో మృతురాలికి చెందిన చెప్పులు, ఓ బంగారు చైను పడి ఉన్నాయి. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కాలిపోయి ఉంది. క్లూస్‌ టీం ఎస్సై శరత్‌బాబు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. హత్య జరిగిన స్థలానికి డాగ్‌ స్క్వాడ్‌ బృందంను పిలిపించారు. శునకం హత్య జరిగిన గుడి చుట్టూ కలియతిరిగి హైవేపైకి చేరుకుని ఆగిపోయింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు