మహిళ దారుణ హత్య

26 Nov, 2019 11:48 IST|Sakshi
సంఘటన స్థలంలో పోలీసులు

తల లేని మృతదేహం లభ్యం

విచారణ జరుపుతున్న పోలీసులు

సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు మత్తడి కాలువ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ హత్యకు గురైన సంఘటన సోమవారం వెలుగు చూసింది. సంఘటన స్థలంలో తలలేని మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి పడి ఉంది. వారం రోజుల క్రితం హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద చెరువు మత్తడి వాగు దగ్గర గుర్తుతెలియని ఓ శవం పడి ఉందని సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. తల లేని మృతదేహాన్ని గుర్తించి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో వారం క్రితం హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతురాలి వయసు 34 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలను రప్పించి ఆధారాలను సేకరించారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్‌హెచ్‌ఓ జగదీష్, ఎస్సైలు రవికుమార్, గోవింద్‌ ఘటన స్థలాన్ని సందర్శించారు. అక్కడే పోస్టుమార్టం పూర్తి చేయించారు. ఇటీవల అదృశ్యమైన వారి వివరాలను పరిశీలిస్తున్నారు. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడవేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.   

మరిన్ని వార్తలు