వివాహేతర సంబంధంతో మహిళ హత్య

1 Aug, 2019 07:09 IST|Sakshi
హత్యకు గురైన మల్కియా

విచారణ చేస్తున్న పోలీసులు

తమిళనాడు ,టీ.నగర్‌: వివాహేతర సంబంధం కారణంగా మంగళవారం మహిళ దారుణ హత్యకు గురైంది. తూత్తుకుడి జిల్లా, తిరువైకుంఠం తాలూకా ఆళ్వార్‌తిరునగరి సమీపానగల ముదలైమొళి ఉత్తర వీథికి చెందిన మల్కియా (35), అదే ప్రాంతానికి చెందిన ముత్తుసామిని 17 ఏళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. లారీ డ్రైవర్‌ మాణిక్కరాజ్‌ (40) ముత్తుసామిని చూసేందుకు తరచుగా ఇంటికి వచ్చేవాడు. ఆ క్రమంలో మాణిక్కరాజ్‌కు, మల్కియాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీన్ని గమనించిన ముత్తుసామి భార్య మందలించాడు. ఈ క్రమంలో వారి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఇలావుండగా మల్కియా దీనిగురించి ప్రియుడు మాణిక్కరాజ్‌కు తెలిపింది. అతడి ప్లాన్‌ ప్రకారం ముత్తుసామిని హతమార్చేందుకు మల్కియా సమ్మతించింది. దీంతో గత 13 మే, 2014లో ముత్తుసామిని భార్య, ప్రియుడు హతమార్చారు. ఇరువురిని ఆళ్వార్‌తిరునగరి పోలీసులు అరెస్టు చేసి శ్రీవైకుంఠం కోర్టులో కేసు దాఖలు చేశారు. 2015లో మల్కియా ప్రియుడితోపాటు బెయిలుపై విడుదలయింది. దీంతో వీరిద్దరు కలిసి జీవించసాగారు. పళయకాయిలైలో ఒక కంపెనీలో మల్కియాకు ఉద్యోగం దొరికింది. అదే ప్రాంతానికి చెందిన యువకుడితో మల్కియాకు మళ్లీ వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో మాణిక్కరాజ్, మల్కియాల మధ్య గొడవలు జరిగాయి. మంగళవారం రాత్రి మల్కియా పనిముగించుకుని రోడ్డుపై ఇంటికి తిరిగి వస్తుండగా అక్కడ పొంచివున్న మాణిక్కరాజ్‌ ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మెకానిక్‌ హత్య
సత్యమంగళం సమీపంలో మంగళవారం మెకానిక్‌  హత్యకు గురయ్యాడు. సత్యమంగళం సమీపానగల మెట్టూర్‌ గ్రామానికి చెందిన ఆనందన్‌ కుమారుడు జగదీశ్వరన్‌ (30). ఇతడు సత్యమంగళం–కోవై జాతీయ రహదారిలోగల ఒక లారీ వర్కుషాపులో మెకానిక్‌గా ఉన్నాడు. ఇతడు బుధవారం ఉదయం వర్కుషాపు సమీపానగల రోడ్డులో శవంగా కనిపించాడు. స్థానికులు సమాచారం అందించడంతో సత్యమంగళం పోలీసులు విచారణ జరిపారు. ఈ విషయం తెలుసుకున్న జగదీశ్వరన్‌ తల్లిదండ్రులు బంధువులు రోడ్డుపై భైఠాయించి ఆందోళన జరిపారు. మద్యం మత్తులో ఏర్పడిన తగాదాలో జగదీశ్వరన్‌ హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు.

టైలర్‌ హత్య
తిరుపూర్‌లో మంగళవారం టైలర్‌  దారుణ హత్యకు గురయ్యాడు. పుదుచ్చేరి మెత్తపాక్కం మేట్టు వీథికి చెందిన కలియమూర్తి (48) తన కుమార్తె, కుమారుడితో తరుపూర్‌ విజయాపురం మహాలక్ష్మినగర్‌ రెండో వీధిలో నివశిస్తున్నాడు. కలియమూర్తికి మద్యం అలవాటు ఉంది. ఇతడు మంగళవారం ముత్తనంపాళయంలోగల మద్యం దుకాణానికి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి రాలేదు. స్మశానం చెట్టు కింద శవంగా లభించాడు. అతనిపై దుండగులు పదునైన ఆయుధాలతో దాడిచేసినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు