తెల్లవారితే పెళ్లి చూపులు

20 Jan, 2020 11:05 IST|Sakshi
భాను (ఫైల్‌)

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మరోఇద్దరికి గాయాలు అందరూ ధర్మపురి ఆలయ ఉద్యోగులే..

జగిత్యాల, వెల్గటూరు/ధర్మపురి: తెల్లవారితే పెళ్లిచూపులు అంతలోనే రోడ్డు ప్రమాదంలో వచ్చిన మృత్యువు యువకుడిని కబలించిన సంఘటన విషాదం నింపింది. వెల్గటూరు మండలం కొత్తపెల్లి వద్ద స్టేట్‌ హైవేపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు అదుపు తప్పి బోల్తాపడగా కారు డ్రైవరు పొడేటి భాను (32) మృతిచెందాడు. పెట్టెం సంతోశ్, చిలుక ముక్కు అశ్విన్‌కుమార్‌కు  తీవ్రగాయాలు అయ్యాయి. వీరంతా ధర్మపురి ఆలయ ఉద్యోగులు. ముగ్గురు కలిసి ఆదివారం సినిమా కోసమని కరీంనగర్‌ వెళ్లి ధర్మపురికి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తపల్లి వద్దకు చేరుకోగానే కారు అదుపు తప్పి వాటర్‌ట్యాంకు వద్ద ఉన్న నీటిసంపును ఢీకొట్టి సమీపంలోని విద్యుత్‌స్తంభానికి బలంగా ఢీకొని బోల్తాపడింది.

దీంతో కారులోని ముగ్గురు ఎగిరి బయటపడ్డారు. కారు నడుపుతున్న భాను తలకు తీవ్రంగా గాయంకావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. పెట్టెం సంతోశ్‌ ఆలయంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నాడు. మరోవ్యక్తి చిలుక ముక్కు అశ్విన్‌ పూజారిగా పని చేస్తున్నారు. ప్రమాదంధాటికి విద్యుత్‌పోల్‌ విరిగిపోయి లెవన్‌ కేవీ వైర్లు తెగిపడ్డాయి. కరెంట్‌నిలిచిపోవడంతో పెద్దప్రమాదం తప్పింది.  ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్నేహితులు, బంధువులు,పూజారులు, ఆలయ ఉద్యోగులు ధర్మపురి నుంచి పెద్దసంఖ్యలో ,  ఘటనాస్థలానికి తరలివచ్చారు. భాను మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల  రోదనలు మిన్నంటాయి. భాను తమ్ముడు వెంకటేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు