అంబాజీపేట : రాబోయే రోజుల్లో ప్రతి అవసరానికీ ఆధార్ కార్డే కీలకం కానుందని డీఎస్ఓ జి.ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన అంబాజీపేటలో ఓ రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుతో మాట్లాడుతూ ఆధార్ చట్టబద్ధమైందని, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలతో పాటు, ఇతర అవసరాలకు ఆధార్ కార్డునే పరిగణలోకి తీసుకుంటారని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలో సభ్యులంతా వేలిముద్రలను ఆధార్ సెంటర్ వద్ద తీయించుకోవాలన్నారు. జిల్లాలోని ఆరు మండలాల్లో రేషన్ షాపులను తనిఖీ చేశామన్నారు. ప్రతి నెలా రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీలో ఈ పోస్ విధానాన్ని మరింత వేగవంతం చేసేందుకు సాంకేతిక లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట ఏఎస్ఓ పి.నిత్యానందం, ఎంఎస్ఓలు ఉన్నారు.