వీడని బాలిక హత్యమిస్టరీ | Sakshi
Sakshi News home page

వీడని బాలిక హత్యమిస్టరీ

Published Thu, Aug 4 2016 10:36 AM

వనపర్తిలో బురఖా ధరించిన బాలికతో బైకుపై వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు

గోపాల్‌పేట: బాలిక హత్యకేసు మిస్టరీ వీడడం లేదు. ఘటన జరిగి ఐదు రోజులు గడిచినా పురోగతి లేదు. మండలంలోని తాడిపర్తి శివారులో గతనెల 30న గుర్తు తెలియని బాలిక(14)ను హత్యచేసి, పెట్రోల్‌పోసి తగలబెట్టిన సంఘటనలో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఇందుకోసం పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. వనపర్తి పాతబజార్‌ సమీపంలో పోలీసులు ఏర్పాటుచేసిన రెండు సీసీ కెమెరాల పుటేజీలను బుధవారం పరిశీలించారు. అందులో గతనెల 30న తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో బురఖా ధరించినట్లు ఉన్న బాలికను మధ్యలో కూర్చోబెట్టుకుని ఇద్దరు వ్యక్తులు బైకుపై వెళ్లిన దశ్యాలను గుర్తించి నిశితంగా పరిశీలించారు.

ఆ సమయంలో చీకటిగా ఉండడంతో గుర్తుపట్టడం కష్టసాధ్యంగా మారింది. అయితే బైకుకు దుస్తులు వేలాడుతున్నట్లు కనిపిస్తుడడంతో అనుమానం రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఐదురోజులు అవుతోంది. శవం నుంచి దుర్వాసన వస్తుంది. ఆచూకీ కోసం బాలిక శవాన్ని వనపర్తి ఏరియా ఆస్పత్రి పోస్టుమార్టం గదిలో ఉంచారు. ఏవైనా వివరాలు లభిస్తాయోనని పోలీసులు వేచి చూస్తున్నారు. దీనిపై ఎస్‌ఐ సైదులును వివరణ కోరగా..ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదన్నారు. అన్నికోణాల్లో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గురువారం మృతదేహాన్ని ఖననం చేసే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement
Advertisement