భూపాలపల్లి : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ బావిలోపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భూపాలపల్లి నగర పంచాయతీలోని జంగేడులో గురువారం రాత్రి జరిగింది. స్థానిక సీఐ సీహెచ్ రఘునందన్రావు కథనం ప్రకారం.. జంగేడు గ్రామానికి చెందిన మేదరి రాజ్కుమార్ ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అతడి భార్య సులోచన(35) గత రెండేళ్లుగా కడుపునొప్పి, నడుము నొప్పితో బాధపడుతోంది. స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతోంది. అయినా ఆరోగ్యం బాగుపడలేదు. గురువారం రాత్రి సుమారు 9.30 గంటలకు ఆమెకు భరించలేని కడుపునొప్పి రావడంతో గ్రామంలోని తన తల్లిగారింటికి వెళ్తున్నానని కూతురు కళ్యాణికి చెప్పి బయల్దేరింది. అనంతరం కొద్దిసేపటికి కళ్యాణి తన తాతయ్య లింగయ్యకు ఫోన్ చేసి ‘అమ్మ వచ్చిందా’ అని ఆరా తీయగా సులోచన ఇక్కడికి రాలేదని చెప్పడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గ్రామంలో వెతకసాగారు. సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో తన తండ్రి లింగయ్య ఇంటి సమీపంలోని ఓ బావిలో సులోచన శవమై కనిపించింది. మృతురాలికి కుమార్తె కల్యాణి, కుమారుడు పవన్ ఉన్నారు.