మంచంపైకి దూసుకెళ్లిన కారు

20 Apr, 2017 00:14 IST|Sakshi
- ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
 
పెంచికలపాడు (గూడూరు రూరల్‌): ఉపాధి పనులకు వెళ్లి వచ్చి..ఇంటి ముందు మంచం వేసుకొని సేదతీరుతున్న తండ్రి, కొడుకుపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రి మృతి చెందంగా కుమారునికి తీవ్ర గాయాలయ్యాయి. గూడూరు మండలం పెంచికలపాడులో బుధవారం.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కర్నూలు రోడ్డు పక్కన నివాసం ఉంటున్న చిన్న నాగన్న రోజు వారీగా ఉదయం కొడుకు తిరుమలేష్‌తో కలిసి ఉపాధి పనులకుÐð వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఎండ వేడిమికి తాళలేక ఇంటి ముందు మంచం వేసుకుని చిన్న నాగన్న (66), కుమారుడు తిరుమలేష్‌(35) సేదతీరుతున్నారు.
 
అయితే కర్నూలు నుంచి కోడుమూరు వైపు  అతి వేగంగా వస్తున్న ఏపీ 21 జెడ్‌ 0005 నెంబర్‌ గల మారుతి స్విఫ్ట్‌ కారు అదుపు తప్పి రోడ్డు పై నుంచి కిందకు దిగి మంచంపై కూర్చున్న చిన్న నాగన్న, తిరుమలేష్‌ను ఢీ కొట్టి ఇంటిలోకి దూసుకెళ్ళింది.  ప్రమాదంలో చిన్న నాగన్న అక్కడికక్కడే మృతి చెందగా, తిరుమలేష్‌కు తీవ్ర గాయాల పాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న కె.నాగలాపురం ఎస్‌ఐ మల్లికార్జున, హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారు డ్రైవర్‌ అతి వేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, తీవ్రంగా గాయపడిన తిరుమలేష్‌ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ చెప్పారు.
 
మరిన్ని వార్తలు