నేరపూరిత నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు తీసింది

7 Apr, 2017 01:30 IST|Sakshi
సాక్షి, అమరావతి :  పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు కార్మికుల మరణానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఆనంద్‌ ఆక్వా ఇండస్ట్రీస్‌ యాజమాన్యం బాధ్యత వహించాలని ప్రముఖ పర్యావరణవేత్త మేథాపాట్కర్‌ నాయకత్వంలోని జాతీయ ప్రజా ఉద్యమాల సంఘటన (ఎన్‌ఏపీఎం) నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ, యాజమాన్యాల నేరపూరిత నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బలి గొన్నదని నిగ్గు తేల్చింది. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆనంద్‌ ఆక్వా పరిశ్రమను మూసివేయాలని కోరింది. మొగల్తూరు నల్లంవారితోట గ్రామంలోని ఆనంద ఆక్వా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు మరణించిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు చెందిన సామాజిక సేవా కార్యకర్తలు రామకృష్ణంరాజు, మీరా సంఘమిత్ర, విమల, బాబ్జీ, రాజేష్‌ తదితరులు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి వాస్తవాలను పరిశీలించారు. మే«థాపాట్కర్‌ మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌కు చెందిన అరుణ్‌రాయ్, శంకర్‌సింగ్, ప్రఫుల్లా సమాంతర (లోక్‌శక్తి అభియాన్‌), బినాయక్‌ సేన్‌, సందీప్‌ పాండే, గీతా రామకృష్ణన్‌, మీరా సంఘమిత్ర సహా 25 మంది సేవా సంస్థల కార్యకర్తల సంతకాలతో కూడిన నిజనిర్ధారణ నివేదికను గురువారం మీడియాకు విడుదల చేశారు. వారు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
l2012లో నల్లంవారి తోటలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ కాలుష్యంతో ఇప్పటికే పది కుటుంబాలు (మొత్తం ఉన్నదే 60 కుటుంబాలు) గ్రామాన్ని వదిలివెళ్లాయి. కొంతమంది గ్రామస్తులు భూముల్ని అమ్ముకున్నారు. 
lగ్రామస్తుల ఫిర్యాదు మేరకు నెల క్రితం సబ్‌ కలెక్టర్‌ ఈ గ్రామాన్ని సందర్శించి వ్యర్థాల నిర్వహణకు ఒక ట్యాంకును నిర్మించాలి్సందిగా హెచ్చరించి వెళ్లారు. ఇప్పటివరకు ట్యాంకు నిర్మించలేదు.
lయాజమాన్యానికి అధికార పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఇలాంటి 8 ఫ్యాక్టరీలు నిర్వహిస్తోంది. ఈ కారణంగానే సబ్‌ కలెక్టర్‌ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యమే ఐదుగురు కార్మికుల్ని బలిగొంది. 
lఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయకుండానే గొంతేరు కాలువలోకి వదలడం వల్ల వేలాది మంది జీవనోపాధికి ప్రమాదం ఏర్పడింది. యాజమాన్యం మాత్రం లాభాలను దండుకుంటోంది.
డిమాండ్లు ఇవీ
lఐదుగురు మృతి ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
lఆనంద్‌ గ్రూపు నడుపుతున్న సంస్థల్లో కాలుష్య స్థాయిని నిర్ధారించేందుకు పర్యావరణ, విద్యావేత్తలు, సేవా కార్యకర్తలు, న్యాయకోవిదులు, అధికారులతో నిపుణుల కమిటీని నియమించాలి.
lగొంతేరు కాలువలోకి వ్యర్థాలు వదలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.
lతుందుర్రులో మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణం ఆపేయాలి. 
 
మరిన్ని వార్తలు