పరిగిలో కాల్పుల కలకలం

30 Jul, 2016 08:46 IST|Sakshi

వికారాబాద్ : రంగారెడ్డి జిల్లా పరిగిలో కాల్పులు కలకలం సృష్టించింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సైపై దుండగులు కాల్పులకు యత్నించారు. అయితే ఈ కాల్పుల నుంచి ఎస్సై ఓబుల్రెడ్డి తప్పించుకుని... దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అ క్రమంలో ముగ్గురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో దుండగుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.

పోలీసుల కథనం ప్రకారం... పరిగిలో శుక్రవారం రాత్రి ఎస్సై ఓబుల్రెడ్డి గస్తీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో స్థానిక ఎస్బీహెచ్ సమీపంలోని గంజిరోడ్డుపై అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను ఎస్సై గుర్తించారు. వారిని ప్రశ్నించేందుకు ఎస్సై సన్నద్దమవుతున్న తరుణంలో వారు కారులో పరారయ్యారు.

వెంటనే ఎస్సై వారిని వెంబడించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారైయ్యారు. ఈ క్రమంలోనే ఎస్సైపై దాడికి యత్నించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ నవీన్కుమార్ పరిగిపోలీస్ స్టేషన్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి తుపాకీలతోపాటు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బ్యాంకు చోరీకి వచ్చారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు