ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తెపై హత్య కేసు | Sakshi
Sakshi News home page

ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తెపై హత్య కేసు

Published Sat, Jul 30 2016 8:18 AM

ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తెపై హత్య కేసు

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలోని నంది గ్రూప్ కంపెనీస్ అనుబంధ సంస్థ నంది అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్ లో పీఆర్ఓ మేడం సుమంత్ హత్యకేసులో ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె, నంది గ్రూప్స్ డైరెక్టర్ సుజలతో పాటు ఆమె వద్ద పనిచేసే మరో ఇద్దరిపై హత్య కేసు నమోదు అయింది. ఈ మేరకు రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. పీఆర్ఓగా ఉన్న సుమంత్ కేటాయించిన లక్ష్యం మేరకు అడ్మిషన్లు చేయలేకపోవడం, ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో పాఠశాల యాజమాన్యం తీవ్రంగా పరిగణించి గురువారం పాఠశాలలోనే నిర్భందించింది.

ఆ రోజు రాత్రి సుమంత్ సోదరుడు సునీల్ పాఠశాలకు వెళ్లి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున యాజమాన్యానికి చెందిన మురళీ, షఫీ అనే వ్యక్తులు ఫోన్ చేసి సుమంత్ అనారోగ్యంతో ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సోదరుడు సునీల్, బంధువులు ఆస్పత్రికి వెళ్లగా సుమంత్ శవమై కనిపించాడు. ఒంటిపై గాయాలు ఉండటంతో కొట్టి చంపినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సుజలతో పాటు షఫి, మురళీపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement
Advertisement