మరో నాలుగు గ్రామాలకు గోదారమ్మ

15 Apr, 2016 02:13 IST|Sakshi
మరో నాలుగు గ్రామాలకు గోదారమ్మ

గడువుకు ముందే పైప్‌లైన్ కనెక్షన్ హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
గజ్వేల్: గడువుకు ముందే గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి, గిరిపల్లి, బయ్యారం, బెజుగామ గ్రామాలకు గురువారం రాత్రి గోదావరి జలాలను అందించారు. ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు నేతృత్వంలో ‘మిషన్ భగీరథ’ గజ్వేల్ ఈఈ రాజయ్య ఆయా గ్రామాల్లో గోదావరి జలాల పైప్‌లైన్‌ను లింక్ చేశారు. కొన్ని రోజులుగా దాహార్తితో అల్లాడుతున్న ఈ గ్రామాలకు ‘గోదారమ్మ’ రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ‘మిషన్ భగీరథ’ పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఏప్రిల్ 30 నాటికి నియోజకవర్గంలోని 128 పంచాయతీలకు నీటి సరఫరా అందించేందుకు ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ‘మిషన్ భగీరథ’ అధికారులు చురుకుగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా గోదావరి జలాలను అందుకున్న ఆయా గ్రామాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు