కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడు నలుగురికి ప్రాణం పోశారు. పట్టణంలోని సప్తగిరి కాలనీకి చెందిన జోగినిపల్లి రామ్మోహన్ రావు(34) రూసో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
శనివారం సాయంత్రం విధులు పూర్తి చేసుకుని తిరిగివస్తుండగా శ్రీరాములపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ పై వస్తున్న ఆయనను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో ఆయన తలకు తీవ్రగాయమైంది. చుట్టుపక్కల వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమయం గడిచే కొద్దీ పరిస్ధితి విషమిస్తుడటంతో ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారని డాక్టర్లు ధ్రువీకరించారు.
అవయవదానం ద్వారా నలుగురికి ప్రాణదానం చేయవచ్చని అవగాహన కల్పించారు. వారు అందుకు ఒప్పుకోవడంతో జీవన్దాన్ సంస్థకు ఆదివారం అవయవ దానం చేశారు. రాంమోహన్రావు కాలేయం, కిడ్నీలు, గుండెను అపోలోరీచ్ ఆస్పత్రిలో ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లావణ్య పర్యవేక్షణలో జీవన్దాన్ బృందానికి అందించారు.