పెళ్లికి ఒత్తిడి చేసిందనీ..

25 May, 2016 20:25 IST|Sakshi

-పియురాలిని చంపిన యువకుడి రిమాండు
- కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ అశోక్‌ కుమార్
మేడ్చల్: పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి చేయడంతో మృగంగా మారిన ప్రియుడు ఆమెను చంపేశాడు. కేసు మిస్టరీని ఛేదించిన మేడ్చల్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఏసీపీ అశోక్‌ కుమార్ మాట్లాడుతూ వుండలంలోని శ్రీ రంగవరం గ్రామానికి చెందిన స్వప్న(19) అదే గ్రామానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి మహేందర్(23) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కొన్నాళ్లకు స్వప్న గర్భం దాల్చింది. మరదలంటే ఇష్టం ఉన్న మహేందర్ ఆమెను పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని స్వప్నకు తెలియజేశాడు.

ఇందుకు తిరస్కరించిన స్వప్న తాను గర్భవతినయ్యానని త్వరగా పెళ్లి చేసుకోవాలని మహేందర్ పై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. దీంతో స్వప్నను కలిసి మాట్లాడటం మానేసిన మహేందర్ ఫోన్ ద్వారా సంభాషణలు సాగించాడు. ఈ నెల 17న బాబాయి ఫోన్ నుంచి మహేందర్ కు ఫోన్ చేసిన స్వప్న మహేందర్ ను కలవాలని చూడాలని ఉన్నట్లు చెప్పింది. దీంతో స్వప్నను ఎలాగైనా వదిలించుకోవాలని పక్కా ప్లాన్ వేసుకున్న మహేందర్ ఆమెను అంతం చేయాలని పథకం వేసుకున్నాడు. ఈ క్రమంలో దర్గా దగ్గర పొదల్లో కర్రను దాచి ఉంచాడు. తర్వాత స్వప్న రాక కోసం ఎదురుచూస్తుండగా ఆమె రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కల్లు కాంపౌండ్ వద్దకు ఒంటరిగా చేరుకుంది. ప్రియురాలిని తన బైక్ పై ఎక్కించుకున్న మహేందర్ దర్గా దగ్గరున్న పొదల వద్దకు తీసుకువెళ్లాడు.

స్వప్న పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆగ్రహానికి గురైన ప్రియుడు ఆమె గొంతు నులిమేశాడు. అనంతరం చున్నీతో గొంతుకు బిగించి ఉరి వేశాడు. ఆమె మృతి చెందిందని నిర్థారించుకున్న తర్వాత ఇంటికి వెళ్లిపోయినట్లు ఏసీపీ వివరించారు. మరుసటి రోజు స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టారు. మహేందర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే స్వప్నను చంపేసినట్లు వెల్లడించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు