నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల జలపాతంలో ఒకరు గల్లంతయ్యారు. కుంటాల జలపాతం అందాలను తిలకించేందుకు ఆదివారం సాయంత్రం నిజామాబాద్ నుంచి ఏడుగురు మిత్రబృందంతో కలిసి వచ్చారు. ప్రకృతి అందాలను వీక్షించారు. ఈ క్రమంలో కుంటాల జలపాతం వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు రుద్రవరం వినయ్(31) గల్లంతయ్యాడు. మిగతా మిత్రులు తేరుకునే లోపే ఆయన కనిపించకుండా పోయాడు.
నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్టకు చెందిన వినయ్ బుక్స్టాల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తుండే వాడని అతడి మిత్రులు తెలిపారు. కాగా జలపాతం వద్ద జాలువారే అందాలను తిలకించడానికి వచ్చి జలపాతంలో గల్లంతయ్యాడు. మిగతా స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి కావడంతో జాలర్లు ఉదయం గాలిస్తామని తెలిపారు. జలపాతంలో అతడు గల్లంతయ్యాడా.. లేక మిత్రులే తోసేశారా అనే అనుమానలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఏఎస్సై దశరథ్ను సంప్రదించగా.. వారు వివరాలు తెలపడానికి నిరాకరించారు.