పెదబయలు: మన్యం ఏవోబీ సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టుల వారోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. పెదబయలు, జి.మాడుగుల మండలాల సరిహద్దు గ్రామాల్లో నిర్మించిన స్థూపాల వద్ద ఎర్రజెండలు ఆవిష్కరించారు. గతంలో వారోత్సవాల సమయంలో∙మావోలు వేలాది మంది జనాలతో సమావేశాలు ఏర్పాటు చేసి, అమరవీరులకు జోహార్లు అర్పించేవారు. అయితే ఈ సారి పోలీసు బలగాలు ఎక్కువగా మోహరించి, గాలింపు ముమ్మరం చేయడం, హెలికాప్టర్లతో కూడా గాలింపు జరపడంతో ఏవోబీలో వారోత్సవాలు ఘనంగా నిర్వహించలేకపోయారని తెలిసింది. ఏవోబీలో పెదబయలు, ముంచంగిపుట్టు, ఒడిశా సరిహద్దు గ్రామాల్లో కూడ స్థూపాల ఆవిష్కరించినట్లు సమాచారం. మొత్తం మీద వారోత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో మన్యం ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.