మీ తగాదాల వల్లే కాంగ్రెస్‌ను వీడా

22 Jun, 2016 02:37 IST|Sakshi
మీ తగాదాల వల్లే కాంగ్రెస్‌ను వీడా

ఉత్తమ్, కోమటిరెడ్డిలపై ‘గుత్తా’ ఫైర్
 
 నల్లగొండ: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డిల గ్రూపు తగాదాల వల్లే తాను కాంగ్రెస్‌పార్టీని వీడానని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్, కోమటిరెడ్డి పరస్పరం ఓడించుకోవాలని ప్రయత్నం చేశారు. నాయకుల మధ్య నెలకొన్న ఈ గొడవల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. పార్టీలో చోటుచేసుకుం టున్న ఈ పరిణామాలను భరించలేకనే బయటకు వెళ్లాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు. మీ నియోజకవర్గాల్లో ఎంపీలంటే కనీసం గౌరవం ఉండడం లేదన్నారు.

చావుకు లేదా పెళ్లికి పోయినా మీ అంగీకారం ఉండాల్సిందేనని విమర్శించారు. నియోజకవర్గాలను తమ సామ్రాజ్యాలుగా చేసుకొని ఏలుతున్నారని గుత్తా మండిపడ్డారు. ‘మా దగ్గర మీ చిట్టాలు చాలా ఉన్నాయి.. కానీ చెప్పను. అది మా సంస్కృతి కాదు.  వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. సరైన సమాధానం చెబుతాం.’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాల వల్లనే సుఖేందర్‌రెడ్డి ఎంపీ అయ్యారని.. స్వశక్తి కలిగిన నాయకుడు కాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై గుత్తా మండి పడ్డారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో పనిచేసి రాత్రికి రాత్రే టికెట్ తెచ్చుకుని కోదాడలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉత్తమ్ స్వశక్తి కలిగిన నాయకుడా..? అని గుత్తా ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో నెల రోజుల పాటు చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించిన రేవంత్ రెడ్డి.. స్థాయికి మించి విమర్శలు చేయడం సరియైంది కాదన్నారు.

>
మరిన్ని వార్తలు