పెద్దపాడులో దారుణ హత్య

13 Jun, 2017 00:09 IST|Sakshi
- వివాహేతర సంబంధమే కారణమా?
కల్లూరు/గూడూరు రూరల్‌: కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన గాండ్ల దేవేంద్ర (37)ను బండరాళ్లతో తలపై మోది గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఉదయం పొలం పనులకు వెళ్లిన వారు.. వేపచెట్టుకింద రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని చూసి గ్రామ పెద్దకు తెలియజేశారు.  గ్రామ పెద్ద.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కర్నూలు తాలూకా సీఐ నాగరాజుయాదవ్, కె.నాగలాపురం ఎస్‌ఐ మల్లికార్జున ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు పెద్దపాడు గ్రామవాసి గాండ్ల దేవేంద్రగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. డాగ్‌ స్క్వాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. భార్య జయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హతునికి ఒక కుమారుడు, కుమార్తె ఉంది. కుమారుడు యశ్వంత్‌ పదో తరగతి చదివాడు. కుమార్తె మౌనిక ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది.
 
వివాహేతర సంబంధమే ఊపిరితీసిందా?
 గాండ్ల దేవేంద్ర.. కర్నూలు బళ్లారి చౌరస్తాలోని మారుతి రైస్‌ మిల్లులో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న సమయంలో బిల్డింగులకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రమాదంలో కాలికి గాయాలు కావడంతో స్టీల్‌ రాడ్‌ వేయించుకున్న దేవేంద్ర ఎక్కువ దూరం నడవలేడు. ఈ పరిస్థితిలో గ్రామ శివారులోకి ఎలా వెళ్లగలిగాడనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. పక్కా ప్రణాళికతో ఫూట్‌గా మద్యం తాగించి ప్లాట్లకు వేసిన రెండు నంబర్‌ రాళ్లతో తలపై బాది హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగుచేసే అవకాశం ఉంది.  
 
 
మరిన్ని వార్తలు