జోరుగా నకిలీ పాసు పుస్తకాల దందా!

21 Aug, 2016 23:58 IST|Sakshi
కొడకండ్ల : అమాయక రైతులే ఆసరాగా కొంతమంది దళారులు నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీ దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పనులు కాక విసిగిపోయిన అన్నదాతలే లక్ష్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఆయా గ్రామాల్లోని కొంతమంది దళారులుగా అవతారమెత్తి నకిలీ పాసు పుస్తకాల సృష్టికర్తల కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో రైతు నుంచి ఎకరానికి రూ.5వేల నుంచి రూ.7వేల చొప్పున  వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డబ్బు చేతికి అందగానే పదిహేను రోజుల వ్యవధిలో పని పూర్తి చేస్తామంటూ నమ్మబలుకుతున్నట్లు పేర్కొంటున్నారు. పాసు పుస్తకాల తయారీ ప్రక్రియ తర్వాత కంప్యూటర్‌ పహాణీల్లో నమోదు కోసం రెవెన్యూ యంత్రాంగంలోని పలువురు సిబ్బందిని మచ్చిక చేసుకొని ఉండొచ్చని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొడకండ్ల మండల కేంద్రం శివారులోని ఓ గిరిజన తండా కేంద్రంగా కొంతమంది ఈ నకిలీ పాసు పుస్తకాల తయారీని కొనసాగిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ ముఠాకు పోచంపల్లి, గంట్లకుంట, రామవరం తదితర గ్రామాల్లో కొంతమంది మధ్యవర్తులు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.    
>
మరిన్ని వార్తలు